విళ్లివాకం న్యూస్: మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల ధర్మనిధి ఉపన్యాసాలు గురువారం ప్రారంభమయ్యాయి. మొత్తం ఆరు ధర్మనిధి ఉపన్యాసాలు ప్రారంభం కాగా గురువారం ఉదయం ప్రారంభ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి డా. పాండురంగం కాళియప్ప స్వాగతం పలకగా, సభాధ్యక్షులుగా తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య విస్తాలి శంకరరావు మాట్లాడుతూ వైవిధ్యమైన కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా ఈ ధర్మనిధి ఉపన్యాసాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో మొత్తం ఆరు ధర్మనిధి ఉపన్యాసాలు అందులోను మూడు ఈ శాఖ ఆచార్యులదే కావడం మరో విశేషంగాను, మరో మూడు తెలుగుభాషా సేవకుల శ్రేయోభిలాషులు ఏర్పాటు చేశారని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విశిష్టమైనవిగాను, ఇవి సాధారణ సదస్సులకంటే విభిన్నమైనవని, ఒక్కొక్క ధర్మనిధి ఉపన్యాసం ఒక్కొక్క ధర్మనిధి అంశాన్ని కలిగి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన వై.వి. హరికృష్ణ పాల్గొని ధర్మనిధి ఉపన్యాస ప్రత్యేక సంచికను ఆవిష్కరించి, తెలుగు శాఖ కార్యక్రమాలను ప్రశంసిస్తూ విద్యార్థులకు ఎంతో ప్రయోజకరమైన కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులకు మరింత ప్రయోజనకరమైనదని తెలియజేశారు.
అంతేకాక జాతీయ స్థాయిలో ధర్మనిధి ఉపన్యాసాలు నిర్వహించడం వాటిని ఒక పుస్తక రూపంలో తీసుకురావడం చాలా గొప్ప విషయమని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆచార్య విస్తాలి శంకరరావుగారికే సాధ్యం అని పేర్కొన్నారు.
అలాగే, ప్రత్యేక అతిథి బాలంత్రపు శ్రీమతి రామనాథ్ విశిష్ట కార్యక్రమాలు చేపడుతున్న విస్తాలి వారి సేవ అభినందనీయం అని పేర్కొన్నారు. విస్తాలి శంకరరావుగారు చేసే కార్యక్రమాలు నిత్య నూతనంగా ఉంటుంటాయని, తెలుగుశాఖ, మద్రాసు విశ్వవిద్యాలయం మరింత కొత్త పుంతలు తొక్కుతోందని కొనియాడారు. ఆత్మీయ అతిథి గుడిమెట్ల చెన్నయ్య మాట్లాడుతూ తెలుగుశాఖలో జరుగుతున్న కార్యక్రమాలు పాఠకులకు అత్యంత విలువైవిగా ఉన్నాయని, తెలుగుశాఖ సేవలను ప్రశంసిస్తూ మరింత విస్తృతంగా సాహిత్య కార్యక్రమాలను కొనసాగించాలని పేర్కొంటూ ఆచార్య విస్తాలి శంకరరావును అభినందించారు.
ధర్మనిధి ఉపన్యాసాల ప్రారంభోపన్యాసంలో భాగంగా ఆచార్య ఎల్.బి. శంకరరావు మాట్లాడుతూ తెలుగుశాఖ చేసే కార్యక్రమ విశిష్టతలను, ధర్మనిధి ఉపన్యాసాల అవశ్యకతను మరియు ధర్మనిధి ఉపన్యాసాల ప్రత్యేకతను ఈ ధర్మనిధి ఉపన్యాసాల వలన భావితరాలవారు, సాహితీవేత్తల సేవలను వారి పేరు మీదుగా విజ్ఞానాన్ని అందరికీ అందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా చెబుతూ ఈ శాఖలో మొదటగా ఆర్కాటు ప్రకాశరావు, ఆచార్య గంధం అప్పారావు ధర్మనిధి ఉపన్యాసాలు ప్రారంభించడం జరిగిందన్నారు. తర్వాత మరో నాలుగు ధర్మనిధి ఉపన్యాసాలు ఏర్పాటు కాబడ్డాయని పేర్కొంటూ మరీ ముఖ్యంగా ఈ ధర్మనిధి ఉపన్యాసాలను ఒక పుస్తక రూపంలో తీసుకురావడం అభినందనీయమన్నారు.
చివరగా పెద్దోజు నరేష్ వందన సమర్పణ చేశారు. ఆ తర్వాత మొదటి సమావేశంలో భాగంగా మొదటి ధర్మనిధి ఉపన్యాసం ఆచార్య గంధం అప్పారావు ధర్మనిధి ఉపన్యాసంలో భాగంగా మద్రాసు విశ్వవిద్యాలయం, మలయాళ శాఖాధ్యక్షులు ఆచార్య పి.ఎం. గిరీష్ 'మలయాళ సాహిత్యంలో మానవతావాదం' అనే అంశంపై ప్రసంగిస్తూ, మలయాళ సాహిత్యంలోని నవల, కథ, కథానిక, నాటకం మొదలైన ప్రక్రియల్లో మానవతావాదం విలువలను గురించి విశ్లేషించారు.
మధ్యాహ్నం భోజనం అనంతరం రెండవ సమావేశం ప్రారంభమైంది.
అందులో ఆర్కాటు ప్రకాశరావు స్మారక ధర్మనిధి ఉపన్యాన్యాసంలో భాగంగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, ప్రాచ్య పరిశోధనా కేంద్రం సంచాలకులు ఆచార్య పి.సి. వెంకటేశ్వర్లు 'మహాత్మ్యకావ్యాలు - సామాజిక సందేశం' అనే అంశంపై ప్రసంగిస్తూ పాండురంగ మాహాత్మ్యం, కాళహస్తీశ్వర మాహాత్మ్యం అనే
రెండు కావ్యాల్లోని సామాజికతను గురించి ప్రసంగిస్తూ క్షేత్ర మహాత్మ్యాలను కావ్యాలుగా మలచిన ధూర్జటి, తెనాలి రామకృష్ణ కవులిద్దరి కావ్య ప్రయోజనాన్ని సాధించడంతో పాటు తమ తమ కావ్య దైవాలకు ఉత్కృష్టమైన మాహాత్మ్యాలను వర్ణించే క్రమంలో సమాజంలోకి వెళ్లారు. మనిషిని దేవుని దగ్గరకు తీసుకురావడానికి కవులు సమాజంలోకి, ఆ మనుషుల దగ్గరకు వెళ్లక తప్పలేదనే భావన వారి రచనల్లో స్పష్టంగా తెలుస్తుందని పేర్కొన్నారు.
మూడవ ధర్మనిధి ఉపన్యాసం ఆచార్య ములమూడి ఆదిలక్ష్మి ధర్మనిధి ఉపన్యాసంలో భాగంగా భారతీయ భాషలు, సాహిత్య అధ్యయన కేంద్రం, ఢిల్లీ విశ్వవిద్యాలయం ఆచార్యలు గంపా వెంకటరామయ్య ప్రసంగిస్తూ మానవ నాగరికత వికాసంలో జ్ఞాన ప్రసారం అనేది అత్యంత కీలకమైన అంశం. ఒక సమాజం లేదా ఒక సంస్కృతి సముపార్జించిన జ్ఞానం, భౌగోళిక, భాషా సరిహద్దులను దాటి ఇతర సమాజాలకు చేరడంలో 'అనువాదం' ఒక వారధిలా పనిచేస్తుందన్నారు. చరిత్రను నిశితంగా పరిశీలిస్తే, మతం, విజ్ఞానశాస్త్రం, సాహిత్యం, తత్వశాస్త్రం వంటి అనేక రంగాలు అనువాదం ద్వారానే విశ్వవ్యాప్తం అయ్యాయి. అయితే, ఈ అనువాద ప్రక్రియను అర్ధం చేసుకోవడంలో, ఆచరించడంలో 'ప్రాచ్య, 'పాశ్చాత్య' దేశాల మధ్య మౌలికమైన భేదాలు ఉన్నాయని పేర్కొన్నారు. శుక్రవారం మొత్తం మూడు ధర్మనిధి ఉపన్యాసాలు కొనసాగుతాయి. అందులో ఎస్.ఆర్.చందూర్ స్మారక ధర్మనిధి ఉపన్యాసం, ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ ధర్మనిధి ఉపన్యాసం, ఆచార్య జి.వి.ఎస్.ఆర్. కృష్ణమూర్తి ధర్మనిధి ఉపన్యాసంతో పాటు ముగింపు సమావేశం జరగనుంది.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com