-- నమ్మిన యువకుడే నట్టేట ముంచాడు
-- ఆరోగ్యం కుదుటపరుస్తామని చెప్పి అంతమొందిచాడు
-- 12 రోజుల తర్వాత వీడిన సీఐ తల్లి అదృశ్యం మిస్టరీ
-- డి.ఎస్.పి, తహసిల్దార్ సమక్షంలో పోస్టుమార్టం
-- అంత్యక్రియలు నిర్వహించిన కుమారుడు
మదనపల్లె న్యూస్ :
ఒంటరిగా ఉన్న మహిళకు చేదోడు వాదోడు గా ఉంటానన్న యువకుడు నమ్మించి నట్టేట ముంచాడు. ఆమె వద్ద ఉన్న నగదు, నగల కోసం ఆశపడి ఆమెకున్న అనారోగ్యాన్ని ఎరగా చేసుకొని ఆరోగ్యం కుదుట పరుస్తానని చెప్పి మరో మిత్రుడు తో కలిసి అంతమొందించాడు. 12 రోజుల తర్వాత ఈ అదృశ్యం కేసు మిస్టరీని పోలీసులు చేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మృతురాలని పూడ్చిపెట్టిన ప్రదేశంలో నే పోస్టుమార్టం నిర్వహించి హత్య కేసు నమోదు చేశారు. కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రంకొండ మండలం మేడికుర్తికి చెందిన స్వర్ణకుమారి (62) మదనపల్లి మండలం సిటిఎం చెందిన ప్యారం శ్రీరాములతో వివాహం అయ్యింది. వీరికి కుమారుడు నాగేంద్ర ఉన్నాడు. 30 ఏళ్ల క్రితం భర్తతో స్వర్ణకుమారి విడిపోయింది. అనంతరం మదనపల్లె దేవళంవీధిలో ఇళ్లు నిర్మించుకుని ఇక్కడే స్థిరపడి కుమారుడితో కలిసి జీవించేది. కుమారుడు పోలీస్ శాఖలో ఉద్యోగం సంపాదించి ప్రస్తుతం ధర్మవరం సిఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆ తరువాత స్వర్ణకుమారి జగన్ కాలనీలో ఓ ఇంటిని నిర్మించి అక్కడ నివాసం ఉంటోంది. అదే ప్రాంతంలో మేడికుర్తి కి చెందిన సురేంద్ర, యల్లమ్మ దంపతులు నివాసముంటున్నారు. వీరికి కుమారుడు వెంకటేష్ ఉన్నాడు. స్వర్ణకుమారి కి వెంకటేష్ చేదోడు వాదోడు గా ఉంటూ అప్పుడప్పుడు పనుల్లో సహాయ పడేవాడు. ఈ క్రమంలో స్వర్ణకుమారి వద్ద ఉన్న నగదు, నగలపై ఆశపడ్డాడు. ఎలాగైనా వాటిని కొట్టేయాలని పథకం పన్నాడు. స్వర్ణకుమారి అప్పుడప్పుడు తనకు ఆరోగ్యం బాగోలేదని వెంకటేష్ తో చెబుతుండేది. దీన్ని ఆసరాగా చేసుకున్న వెంకటేష్ స్థానిక గజ్జలకుంటలో ఉన్న అనిల్ తో కలిసి నగదు, నగలు దోచుకునేందుకు పథకం పన్నాడు. నాటు వైద్యం చేసి మంత్రించేవారు నాకు తెలుసని, అక్కడికి వెళ్తే ఆరోగ్యం నయమౌతుందని స్వర్ణకుమారి ని వెంకటేష్ నమ్మించాడు. ఈ క్రమంలో సెప్టెంబర్ 28వ తేదీన తన ద్విచక్ర వాహనంలో స్వర్ణకుమారిని ఎక్కించుకొని గజ్జల కుంటలో ఉన్న అనీల్ ఇంటికి వెళ్లాడు. అనిల్ ఇంట్లో మంత్రాలు చదువుతో స్వర్ణకుమారి పూజలో నిమగ్నమైన సమయంలో సుత్తితో ఆమె తలపై మోది హత్య చేశారు. ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకుని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పైనాన్స్ బ్యాంకు లో తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఓ గోనెసంచిలో వేసి, ఆరోజు రాత్రి నీరుగట్టు వారిపల్లి సమీపంలోని స్మశాన వాటికలో అప్పటికే శవాన్ని పూడ్చి ఉన్న ఓ గుంతను తవ్వి అందులో గోనె సంచితో పాటే మృతదేహాన్ని వేసి కప్పెట్టేసి అక్కడి నుంచి పరారయ్యారు.
అక్కడి నుంచి నేరుగా తిరుపతికి వెళ్లి రేణిగుంట లో ఫ్లైట్ ద్వారా బెంగళూరుకు చేరుకొని బెంగళూరు నుంచి రాజస్థాన్ కు పరారయ్యారు. తల్లి అదృశ్యం కావడంతో కుమారుడు నాగేంద్ర అక్టోబర్ 1 వ తేదీన తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తును ప్రారంభించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారంతో మంగళవారం నీరుగట్టువారి పల్లి స్మశాన వాటికలో డిఎస్పి కొండయ్య నాయుడు, తాహసిల్దార్ ఖాజాబీ ఆధ్వర్యంలో మృతదేహాన్ని వెలికి తీసి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించి మృతదేహాన్ని కుమారుడు నాగేంద్ర కు అప్పగించారు. కుటుంబ సభ్యులతో కలిసి అదే ప్రాంతంలో తల్లికి అంత్యక్రియలు నిర్వహించాడు.
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com