అంతర్జాతీయంగా యుద్ధ పరిస్థితులు ఉత్కంఠ రేపుతున్న వేళ, దేశంలో ఇంధన కొరతపై వస్తున్న వార్తలకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్పష్టత ఇచ్చింది. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేస్తూ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
దేశంలో ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్రం వెల్లడించింది. రాబోయే 60 రోజుల పాటు దేశవ్యాప్తంగా ప్రజల అవసరాలను తీర్చడానికి సరిపడా పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయని తెలిపింది. అంతేకాకుండా, అదనంగా అవసరమైన ముడి చమురు ఇప్పటికే భారత్కు చేరుకునే ప్రక్రియలో ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో బంకుల వద్ద క్యూ కట్టడం, ఇంధనాన్ని నిల్వ చేసుకోవడం వంటి చర్యలు అవసరం లేదని స్పష్టం చేశారు.
వంటగ్యాస్ సరఫరాపై కూడా కేంద్రం భరోసా ఇచ్చింది. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి భారీగా ఎల్పీజీ దిగుమతులు జరుగుతున్నాయని పేర్కొంది. దాదాపు 8 లక్షల టన్నుల ఎల్పీజీ దేశానికి చేరుకుంటోందని, ఇప్పటికే కొన్ని నౌకలు తీరానికి చేరుకోగా మరికొన్ని ప్రయాణంలో ఉన్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే నెల రోజుల పాటు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేసింది.
అయితే, వదంతులను నమ్మి ప్రజలు అనవసరంగా భయపడవద్దని కేంద్రం విజ్ఞప్తి చేసింది. కొందరు కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నందున, అటువంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్రాలకు సూచించింది.
ఇంధన భద్రత విషయంలో దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని, అంతర్జాతీయ పరిస్థితులు ఎలా ఉన్నా సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది.
...........