Logo
Date of Publish : 25 June 2024, 11:47 am
Editor : CH. MUKUNDARAO

బెస్ట్‌ ఫీల్డర్‌ మెడల్‌.. విండీస్‌లో క్యాచ్‌లు అందుకోవడం కష్టం: భారత కోచ్

      టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) భారత్‌ సెమీస్‌కు చేరింది. ఆస్ట్రేలియాపై అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం ప్రదర్శించిన టీమ్‌ఇండియా సూపర్‌-8 గ్రూప్‌-1లో అగ్రస్థానం సాధించింది. ఆసీస్‌పై అద్భుతమైన క్యాచ్‌ను అందుకొన్న అక్షర్ పటేల్‌కే ఈసారి 'బెస్ట్‌ ఫీల్డర్‌' మెడల్‌ దక్కింది. ముగ్గురు పోటీపడగా.. అందులో అక్షర్‌ను విజేతగా భారత కోచ్ దిలీప్ ప్రకటించాడు. త్రోడౌన్‌ స్పెషలిస్ట్ నువాన్ సేనెవిరత్నె ఈసారి అక్షర్‌కు (Axar Patel) మెడల్‌ అందజేశాడు. అందరూ నువాన్‌ను మాట్లాడాలని సరదాగా ఆట పట్టించారు. ''అందరూ బాగా చేశారు. మెడల్‌ అందుకొన్న అక్షర్ పటేల్‌కు శుభాకాంక్షలు. చివరి నిమిషం వరకూ నేను ఈ మెడల్‌ను అందిస్తానని అనుకోలేదు. నాకు సర్‌ప్రైజ్‌గా ఉంది'' అని వ్యాఖ్యానించాడు. ఈ సమయంలో చాహల్ మధ్యలో చేసిన అల్లరి వైరల్‌గా మారింది. ఆ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

చాలా బాగా చేశారు: దిలీప్

''వెస్టిండీస్‌ పరిస్థితుల్లో ఫీల్డింగ్‌ చేయడం చాలా కష్టం. గాలి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మన కుర్రాళ్లు మాత్రం అదరగొట్టారు. ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ముందుకుసాగుతున్నాం. క్యాచ్‌లు అందుకోవడానికి శాయశక్తులా కష్టపడుతున్నారు. నిబద్ధతతో ఫీల్డింగ్ చేయడం అభినందనీయం. ఈసారి ముగ్గురు పోటీదారుల్లో సూర్యకుమార్‌ యాదవ్, కుల్‌దీప్‌ యాదవ్, అక్షర్ పటేల్ ముందున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మైదానంలో చురుగ్గా వ్యవహరించాడు. అయితే, అక్షర్‌ పటేల్‌ అందుకొన్న క్యాచ్‌ మ్యాచ్‌ను మలుపుతిప్పింది'' అని దిలీప్ (Dilip) వెల్లడించాడు.


All Rights Reserved By telugunewstimes
Print Save