Logo
Date of Publish : 15 February 2026, 1:52 pm
Editor : CH. MUKUNDARAO

ఘనంగా ఆద్య వినయ్ భారతనాట్యం అరంగేట్రం

చెన్నై న్యూస్:మన తెలుగింటి అమ్మాయి, చెన్నై చేట్
పేట్‌లో నివసిస్తున్న ఆశ–వినయ్ దంపతుల ముద్దుల పుత్రిక కుమారి ఆద్య వినయ్ భారతీయ నాట్య ప్రవేశ (అరంగేట్రం) కార్యక్రమం ఆదివారం ఉదయం మైలాపూర్ లోని ఆర్ ఆర్ మహాసభలో ఎంతో ఘనంగా జరిగింది. పాటలకు అనుగుణంగా హావభావాలతో చేసిన ఆమె నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులందరి మన్ననలు పొందాయి.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలైమామణి కె.ఎన్. రామస్వామి, భారతీయ విద్యాభవన్ చెన్నై డైరెక్టర్, గురువు శ్రీమతి శృతి శోభ హాజరయ్యారు. తెలుగు వెలుగు సంక్షేమ సంఘం అధ్యక్షులు అల్లింగం రాజశేఖర్, కుమారి ఆద్య వినయ్‌ను శాలువాతో సత్కరించి “నాట్య మయూరి” అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ, నాట్యం ఒక గొప్ప కళ అని, రాజుల కాలంలో గ్రామ ప్రజల సమస్యలను నాట్య రూపంలో రాజులకు తెలియజేసే సంప్రదాయం ఉండేదని తెలిపారు. ఆ కాలంలో టెక్నాలజీ లేకపోవడంతో నాట్యకళ ప్రజలకు ఎంతో ఉపయోగపడేదన్నారు. రామాయణం, మహాభారతం, శివతాండవం వంటి ఇతిహాసాలను నాట్య రూపంలో చూపిస్తూ భావితరాలను భక్తి మార్గంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు.

మన తెలుగింటి ఆణిముత్యాలను వెలుగులోకి తీసుకురావడం తమ ధ్యేయమని, కుమారి ఆద్య వినయ్ వెంపటి చినసత్యం వంటి మహానుభావుల స్థాయికి ఎదిగి పేరు ప్రఖ్యాతలు పొందాలని, చెన్నైకే పరిమితం కాకుండా దేశ విదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ నాట్యకళకు మరింత గౌరవం తీసుకురావాలని అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్ట్ కళాకారులు పద్మశ్రీ తోట ధరణి, తోట భానూజి దంపతులు, రూపవతి దంపతులు,బంధుమిత్రులు ,కుటుంబ సభ్యులు, తెలుగు ప్రజలు పాల్గొన్నారు.

 

.........


All Rights Reserved By telugunewstimes
Print Save