Logo
Date of Publish : 05 July 2024, 8:17 pm
Editor : CH. MUKUNDARAO

కొత్త నేరచట్టాలను 18వ లోక్ సభ పునఃచర్చించాలి!!

ప్రజాసమస్యలపై పోరాడే వారిని  నేరస్తులుగా పరిగణిస్తూ  బేడీలతో కోర్టు ముందు హాజరు పర్చే  కొత్త నేర చట్టాల ప్రక్రియ అతి దారుణంగా వుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. నిర్భందించడం వంటి  విధానాలు ప్రజాహితానికి విరుద్ధంగా ఉన్నాయన్నారు. న్యాయవ్యవస్థ పై రాజకీయ అధికార ఆధిపత్య ధోరణికి కొత్త చట్టాలు తెచ్చినట్టుందన్నారు. దేశ ద్రోహం  సెక్షన్120- ఎ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం స్టే విధించినందున సెక్షన్ 150గా హక్కులు హరించే విధంగా చేశారన్నారు. దేశంలో 5 కోట్ల కేసులు పెండింగ్ లో వుండగా న్యాయమూర్తుల సంఖ్య పది రెట్లు పెంపు చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ మండలస్థాయి నుండి న్యాయస్థానాల సంఖ్య విస్తరించాల్సి వున్నప్పటికీ సత్వర ప్రణాళిక పనులు లేకుండా దేశ స్వాతంత్ర్యంలో 77ఏళ్ల నాగరిక సమాజాన్ని.. ఆధునిక ఆటవిక వికసితంగా మారే తీరుగా కొత్త నేర చట్టంలో హక్కులు హరించే  దారుణాలున్నాయన్నారు. జీవించే హక్కులను కాలరాసే విధంగా వుండకూడదన్నారు. 95శాతం పాత సెక్షన్ల నంబర్లు మార్చడం ఐపిసి సిఆర్ పిసి ఎవిడెన్స్ యాక్ట్ లకు దేశ ప్రజలకు సంబంధంలేని భాషలో పేర్లు పెట్టి గందరగోళ పర్చేవిధంగా ఉన్నాయన్నారు. నిపుణులతో సరైన పద్ధతిలో చర్చించకుండా చేపట్టిన నూతన చట్టాలను పాశుపతాస్త్రాల్లా ప్రజాస్వామ్య హరణానికి హననానికి దారి తీయించడం తగదన్నారు. 18వ లోక్ సభలో మరోసారి సమగ్ర చర్చ జరిగిన తరువాతే  అమలుకు చర్యలు వహించాలన్నారు. అప్పటి వరకు వాటి అమలు నిలిపివేయాలని పౌర సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజిక వేత్త దూసర్లపూడి రమణరాజు డిమాండ్ చేశారు.


All Rights Reserved By telugunewstimes
Print Save