చెన్నై న్యూస్: చెన్నై మహానగరంలో తెలుగు భాష అభ్యున్నతికి, తెలుగు సాహిత్య వికాసానికి విశేషంగా కృషి చేస్తున్న వేద విజ్ఞాన వేదిక 16వ వార్షికోత్సవాలకు తెలుగు ప్రజలకు ఘన స్వాగతం పలుకుతోంది. చెన్నై విజయరాఘవ రోడ్డులోని ఆస్కా (ఆంధ్ర క్లబ్)లో శుక్రవారం ఉదయం వేదిక అధ్యక్షుడు జె.కె. రెడ్డి, కార్యదర్శి కందనూరు మధు సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వేదిక కార్యదర్శి కందనూరు మధు మాట్లాడుతూ — మా శ్రమ, క్రమశిక్షణతో పాటు మిత్రుల సహకారమే మమ్మల్ని ఈ స్థాయికి తీసుకువచ్చిందని, అందుకు అందరికీ ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉంటామని తెలిపారు.
2010 ఫిబ్రవరిలో సంస్థ కార్యక్రమాలను ప్రారంభించామని, ఆదికవి నన్నయ సాహిత్యంపై స్థానిక పండితుల సమక్షంలో ఆచార్య దేవర్ల చిన్నికృష్ణయ్య గారి ప్రసంగంతో ఈ సాహిత్య యాత్రకు శ్రీకారం చుట్టడం విశేషమని పేర్కొన్నారు. మిత్రుల ప్రోత్సాహం, సీనియర్ సభ్యుడు జె.కె. రెడ్డి గారి మార్గదర్శకత్వంతో గత 16 సంవత్సరాలుగా ప్రతి నెల చివరి ఆదివారం క్రమం తప్పకుండా, సమయపాలనతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకు వివిధ అంశాలపై ఉపన్యాసాలు నిర్వహిస్తూ, తెలుగేతర రాష్ట్రం అయిన తమిళనాడులో నివసిస్తున్న తెలుగు ప్రజల్లో, ముఖ్యంగా యువతలో మాతృభాషపై గౌరవం, మమకారం పెంపొందించడమే తమ లక్ష్యమని తెలిపారు. తెలుగు సాహిత్యంలోని మాధుర్యాన్ని కొత్త తరానికి పరిచయం చేయాలనే సంకల్పంతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని అన్నారు.
ఉపన్యాసాలతో పాటు అనేక పుస్తక ఆవిష్కరణ సభలను నిర్వహించామని, “వేద విజ్ఞాన వేదిక” ఆధ్వర్యంలో కొన్ని గ్రంథాలను ప్రచురించి ఉచితంగా పాఠకులకు పంపిణీ చేశామని చెప్పారు. రచయితలను సన్మానిస్తూ సాహిత్య సేవను కొనసాగిస్తున్నామని వివరించారు.
చెన్నైలో తెలుగు భాష కోసం కృషి చేస్తున్న ఇతర సంస్థలను గుర్తించి, ఆర్థిక పరిమితులు ఉన్నప్పటికీ వారికి సహాయం అందించామని తెలిపారు. ప్రతి సంవత్సరం కొందరికి రూ.25,000, మరికొందరికి రూ.10,000 చొప్పున సుమారు 10 మంది ప్రముఖులకు ఆర్థిక సహకారం అందించామని చెప్పారు.
ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని కేవలం సాహిత్య సభగా కాకుండా కూచిపూడి నృత్యం, శాస్త్రీయ సంగీత కచేరి లేదా తెలుగు నాటకం వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించడం తమ ఆనవాయితీ అని తెలిపారు.
మధ్యలో ఆంధ్ర సోషల్ అసోసియేషన్ భాగస్వాములుగా కలిసి కార్యక్రమాలు నిర్వహించారని, నిర్వహణ మార్పుల కారణంగా వారు విరమించుకున్నప్పటికీ వారి నిర్ణయాన్ని గౌరవించామని చెప్పారు. 2022 నుంచి సభాగృహం, భోజనాలు, అల్పాహారం తదితర ఏర్పాట్లన్నీ స్వయంగా నిర్వహిస్తున్నామని వివరించారు.
గతంలో మద్రాస్ నగరంలోని ప్రముఖ తెలుగు, సంస్కృత పండితులతో పాటు తిరుపతి, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి పలువురు మహానుభావులను ఆహ్వానించి ఉపన్యాసాలు నిర్వహించినట్లు తెలిపారు. బెంగళూరుకు చెందిన ప్రాచార్య శిలాకా రఘునాథ శర్మ గారు, ఆచార్య రామబ్రహ్మం గారు తదితర ప్రముఖులు సభలను అలంకరించారని పేర్కొన్నారు.
అధ్యక్షుడు జె.కె. రెడ్డి మాట్లాడుతూ — చెన్నై వంటి తెలుగేతర మహానగరంలో గత 16 సంవత్సరాలుగా తెలుగు సాహిత్యం, మాతృభాష ఔన్నత్యాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రజలకు, యువతకు చేరవేస్తున్నామని తెలిపారు. కార్యదర్శి కందనూరు మధుతో సమన్వయంతో, క్రమశిక్షణతో కార్యక్రమాలు నిర్వహించడం వల్ల దేశవ్యాప్తంగా వేదికకు గుర్తింపు లభించిందని అన్నారు.
ఈ ఏడాది వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆస్కా ప్రాంగణంలోని గోదావరి హాల్లో నిర్వహించబడుతుంది. ముఖ్య అతిథిగా శాంత బయోటెక్నిక్స్ వ్యవస్థాపకులు, పద్మభూషణ్ డాక్టర్ కె.ఐ. వరప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. విశిష్ట అతిథిగా కళారత్న ప్రభా రమేష్ సితార్ వాద్య కార్యక్రమం అందించనుండగా, సంగీత నీరాజనం కుమారి భవ్య తూములూరు సంగీత కార్యక్రమాన్ని ప్రదర్శించనున్నారు.
చెన్నై మహానగరంలోని తెలుగు సాహితీ ప్రియులు, తెలుగు సంఘాల నిర్వాహకులు, ప్రజలందరూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు ఆహ్వానించారు.
........
Editor : CH. MUKUNDARAO
www.telugunewstimes.com